కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ పాఠం

దేవుడు ఏ ఉద్దేశంతో భూమిని చేశాడు?

దేవుడు ఏ ఉద్దేశంతో భూమిని చేశాడు?

1. దేవుడు భూమిని ఎందుకు చేశాడు?

యెహోవా భూమిని మనుషులకు ఇచ్చాడు. ఇది మన ఇల్లు. దేవుడు మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని పరలోకంలో జీవించడానికి సృష్టించలేదు, ఎందుకంటే పరలోకంలో జీవించడానికి ఆయన అప్పటికే దేవదూతల్ని చేశాడు. (యోబు 38:4, 7) దేవుడు మొదటి మనిషిని ఏదెను తోట అనే అందమైన పరదైసులో ఉంచాడు. (ఆదికాండం 2:15-17) ఆదాము, అతని సంతానం చనిపోకుండా ఎప్పటికీ భూమ్మీద జీవించే అవకాశాన్ని యెహోవా ఇచ్చాడు.కీర్తన 37:29; 115:16 చదవండి.

మొదట్లో ఏదెను తోట మాత్రమే పరదైసుగా ఉండేది. ఆదాముహవ్వలు తమ పిల్లలతో భూమిని నింపాలి, మెల్లమెల్లగా భూమంతటినీ లోబర్చుకొని దాన్ని పరదైసుగా మార్చాలి. (ఆదికాండం 1:28) భూమి ఎన్నటికీ నాశనం కాదు, అది ఎప్పటికీ మనుషులకు ఇల్లుగానే ఉంటుంది.కీర్తన 104:5 చదవండి.

దేవుడు భూమిని ఎందుకు చేశాడు? వీడియో చూడండి.

2. ఇప్పుడు భూమి ఎందుకు పరదైసులా లేదు?

ఆదాముహవ్వలు యెహోవా మాట వినలేదు. అందుకే ఆయన వాళ్లను ఏదెను నుండి పంపించేశాడు. అలా పరదైసు చేజారిపోయింది. మళ్లీ ఎవ్వరూ భూమిని పరదైసులా చేయలేకపోయారు. “భూమి చెడ్డవాళ్ల చేతికి అప్పగించబడింది” అని బైబిలు చెప్తుంది.—యోబు 9:24.ఆదికాండం 3:23, 24 చదవండి.

మనుషుల విషయంలో యెహోవా తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడా? లేదు! ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. (యెషయా 45:18) మనుషులు ఎలా జీవించాలని ఆయన మొదట అనుకున్నాడో, అలాంటి జీవితాన్నే వాళ్లకు ఇస్తాడు.కీర్తన 37:11, 34 చదవండి.

3. భూమి మళ్లీ పరదైసుగా ఎలా మారుతుంది?

దేవుడు రాజుగా నియమించిన యేసు పరిపాలించినప్పుడు, భూమి మళ్లీ పరదైసుగా మారుతుంది. హార్‌మెగిద్దోన్‌ అనే యుద్ధంలో యేసు దేవదూతల్ని ముందుండి నడిపిస్తాడు, దేవున్ని వ్యతిరేకించే వాళ్లందర్నీ నాశనం చేస్తాడు. తర్వాత ఆయన సాతానును 1,000 సంవత్సరాల పాటు బంధిస్తాడు. అయితే యేసు, దేవుని ప్రజల్ని నిర్దేశిస్తూ ఆ నాశనం నుండి కాపాడతాడు. వాళ్లు పరదైసు భూమ్మీద ఎప్పటికీ జీవిస్తారు.ప్రకటన 20:1-3; 21:3, 4 చదవండి.

4. బాధలన్నీ ఎప్పుడు పోతాయి?

దేవుడు భూమ్మీదున్న చెడును ఎప్పుడు తీసేస్తాడు? అంతం దగ్గర్లో ఉందని గుర్తుపట్టడానికి యేసు ఒక “సూచన” ఇచ్చాడు. ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందుముందు మనుషులు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. దీన్నిబట్టి మనం ‘ఈ వ్యవస్థ ముగింపులో’ జీవిస్తున్నామని అర్థమౌతుంది.మత్తయి 24:3, 7-14, 21, 22 చదవండి.

యేసు పరలోకం నుండి 1,000 సంవత్సరాల పాటు భూమిని రాజుగా పరిపాలించినప్పుడు బాధలన్నీ పోతాయి. (యెషయా 9:​6, 7; 11:​9) ఆయన ప్రధానయాజకుడిగా కూడా సేవచేస్తూ, దేవున్ని ప్రేమించేవాళ్ల పాపాల్ని రద్దుచేస్తాడు. అలా యేసు ద్వారా దేవుడు రోగాల్ని, ముసలితనాన్ని, మరణాన్ని పూర్తిగా తీసేస్తాడు.యెషయా 25:8; 33:24 చదవండి.

5. రాబోయే పరదైసులో ఎవరు ఉంటారు?

దేవున్ని ప్రేమిస్తూ ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో నేర్చుకోవాలనుకునే ప్రజల్ని మీరు రాజ్యమందిరంలో కలుసుకుంటారు

దేవునికి లోబడేవాళ్లే పరదైసులో ఉంటారు. (1 యోహాను 2:17) వినయస్థుల్ని వెదికి దేవుడు కోరినట్టు జీవించడం నేర్పించమని యేసు తన అనుచరులకు చెప్పాడు. పరదైసు భూమ్మీద జీవించడానికి యెహోవా లక్షలాది ప్రజల్ని సిద్ధం చేస్తున్నాడు. (జెఫన్యా 2:3) వాళ్లు మంచి భర్తలుగా, తండ్రులుగా, భార్యలుగా, తల్లులుగా ఎలా ఉండాలో యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు-పిల్లలు కలిసి దేవున్ని ఆరాధిస్తూ, బైబిలు నుండి ఎలా ప్రయోజనం పొందాలో నేర్చుకుంటున్నారు.మీకా 4:1-4 చదవండి.